Monday, October 29, 2007

మహాపండిత రాహుల్ సాంకౄత్యాయన్--బహు భాషా పాండిత్యం

మనలో చాలా మందికి ఒక భాషో రెండుభాషలో తెలిసివుండటం జరుగుతుంది. దేశమంతా తిరిగే వారికి మహా అయితే 6,7 భాషలలో ప్రవేశం ఉండవచ్చు. కాని కొంతమంది మహా పండితులు వుంటారు. వారికి కొన్ని పదుల సంఖ్యలో భాషలలో పాండిత్యమే ఉంటుంది. అలాంటి కొందరిలో మన తెలుగువారు పి.వి నరసిం హారావు గారు ఉంటారు . ఇంకా కొందరిలో మన దేశ ప్రముఖ రచయిత మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్. ఈయన పేరు సాహిత్యంతో సంబంధం వున్నవారందరికీ చిర పరిచితమే. ఈయన హిందీలో వ్రాసిన " వోల్గా సే గంగ" అనే గ్రంధం దగ్గర దగ్గర నలభై భాషలకి అనువదింప బడింది . ఈయన ప్రపంచం అంతా సంచరించారు. ప్రపంచమంతా మాట్లాడే భాషలు సుమారుగా మూడువేల వరకూ ఉంటాయి . వాటిని పది కుటుంబాలుగా విభజించారు. వాటిలో చాలా భాషా కుటుంబాలతో ఈయనకి ప్రవేశం వుంది. సంస్కృతం ,పాళి భాషల్లో ఈయన మహా పండితుడు. బౌద్ద సాహిత్యంలో ఈయన పట్టు ఎంతటిదంటే ఆయన జీవించిన కాలంలోనే కాదు ఇప్పటి వరకూ కూడా ఈయనను మించిన వారు లేరు అని చెబుతారు. బౌద్ద సాహిత్యాన్ని ఈయన రష్యన్ భాషలోనికి అనువదించారు. ఈయనకు "త్రిపిటకాచార్య"అనే బిరుదు కూడ వున్నది.
ప్రపంచ భాషలే కాక, మనదేశంలో మాట్లాడే భాషలు కూడా ఈయనకు చాలా వచ్చు . ఒకసారి మన తెలుగు వారైన డా.సంజీవ్ దేవ్ (ఈయన కూడా రచయిత,కవి,చిత్ర కారుడు, ప్రసిద్ధ కళా విమర్శకుడు) రాహుల్ సాంకౄత్యాయన్ ని మనరాష్ట్రాని కి ఆహ్వానించటం జరిగింది. ఆయన సంజీవ్ దేవ్ స్వగ్రామమైన తుమ్మపూడి వచ్చారు. 4,5 రోజులు మనరాష్ట్రంలోపర్యటించారు.
ఒకరోజు బౌద్ద చారిత్రక ప్రదేశాలయిన అమరావతి, నాగార్జునకొండ వగైరా, వగైరా ప్రాంతాలన్నీ పర్యటన చేయటానికి వెళ్ళారు. మధ్యలో ఒక చోట చెట్ల క్రింద విశ్రమించారు. ఆ ప్రక్కగా కొంతమంది లంబాడి తండావారి నివాసాలు కూడా వున్నాయి. వారుకూడా అక్కడేవుండి వారి భాషలో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. రాహుల్ సాంకౄత్యాయన్ వారి మాటలను కొంతసేపు శ్రద్దగా గమనించారు. తరువాత వాళ్ళతో వాళ్ళ భాషలోనే మాట్లాడటం ప్రారంభించారు. సంజీవ్ దేవ్ గారి ఆశ్చర్యానికి అంతులేదు. ఎందుకంటే వారి భాషకు అసలు లిపి లేదు, పేరు లేదు. అది వారిలో వారు మాట్లాడుకునే భాష మాత్రమే. వేరెవరికి అర్ధంకాదు.
తర్వాత సంజీవ్ దేవ్ గారు ఆశ్చర్యంగా అడిగారు. ఇది మీకెలా సాధ్యమైంది? అని. అప్పుడు ఆయన "వారి మాటలను గమనించటం ద్వారా గుజరాత్ ,రాజస్థాన్ ల సరిహద్దు ప్రాంతాన్నించి వారు వచ్చారనీ, ఆ రెండుభాషలనూ వీరు సంకరం చేసి మాట్లాడుకుంటున్నారనీ గమనించాను. వారికి వలెనే ఆభాషల్లో ని క్రియాపదాలను అపభ్రంశం చేసి మాట్లాడాను. అందుచేత వారికి అది అర్ధమైంది." అని చెప్పారు.
అదీ అయన భాషా ప్రజ్ణ. ఈ విషయాన్ని రాహుల్ సాంకౄత్యాయన్ తో తనకున్న అనుభవాన్ని వివరిస్తూ సంజీవ్ దేవ్ గారు ఒకచోట వ్రాసారు.
ఇంతకూ విషాదం ఏమిటంటే ఇంతటి ప్రజ్ణా శేలి, మహా పండితుడు, బహుభాషా కోవిదుడు జ్ణాపక శక్తిని పూర్తిగా కోల్పోవడమే ప్రధాన లక్షణం గా గల వ్యాధితో మరణించారు. తన పేరును తానే మరిచిపోయేంత మతిమరుపు అది. జీవిత చరమాంకం లో ఏ రెండు పదాలనూ అర్ధవంతమైన క్రమంలో మాట్లాడలేక పోయారు.

2 comments:

Naveen Garla said...

http://en.wikipedia.org/wiki/Mahapandit_Rahul_Sankrityayan

చదువరి said...

రాహుల్ సాంకృత్యాయన్ గురించి కొత్త విషయాలు చెప్పారు. నెనరులు!


Blogspot Templates by Isnaini Dot Com and Insurance News. Powered by Blogger